సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ( గురువారం) సాయంత్రం 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించ నున్నారు. సందర్భంగా అనేక రూమర్లు, అంచనాలు అటు రాజకీయ వర్గాల్లో,ఇటు వ్యాపార వర్గాల్లో వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వర్చువల్ లాక్డౌన్ను ప్రధాని ప్రకటించానున్నారని భారీ అంచనాలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ఇలాంటి అంచనాలతోనే సందేహాలనే ట్విటర్ ద్వారా వెల్లడించారు.
మరోవైపు ఈ వార్తలపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఈ సమాచారం తప్పు. ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజల్లో అనవసరమైన భయాందోళనలను కూడా సృష్టిస్తుందంటూ ఆ అంచనాలను ప్రభుత్వ సన్నిహిత వర్గాలు కొట్టి పారేశాయి. కరోనా విస్తరణపై ప్రధాని మోదీ ప్రతీరోజు సమీక్షిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు, కార్యదర్శుల బృందం కూడా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తోంది. అలాగే కోవిడ్-19పై 24 గంటలు పనిచేసేలా ఒక ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు, కరోనా వైరస్ను అడ్డుకునేందుకు ఎలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టబోతున్నారు అనే ఉత్కంఠకు తెరపడలేదు.
కోవిడ్-10 (కరోనా) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ను లాక్ డౌన్ చేయాలని కొందరు వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ కంపెనీ యజమానులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. మార్చి 20 నుంచే ఈ లాక్ డౌన్ ప్రారంభమైతే మంచిదని, వివిధ నగరాల్లో సెక్షన్ 144 విధించాలని 51 మంది వ్యాపారవేత్తలు విన్నవించడం గమనార్హం. కాగా దేశంలో తాజాగా కరోనా వైరస్ సోకి పంజాబ్లో జర్మనీ, ఇటలీ తిరిగి వచ్చిన బాధితుడు గురువారం కన్నుమూశాడు. దీంతో ఈ మహమ్మారి కారణంగా చనిపోయినవారి సంఖ్య నాలుగుకి చేరింది.